దుమ్ము రేపుతోన్న భారత్ .. ఐసీసీ నంబర్-1 బ్యాటింగ్ సింహాసనం అధిరోహించిన నలుగురు స్టార్స్
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుతోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో భారత బ్యాటర్లు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానాలను దక్కించుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఐసీసీ విడుదల చేసే టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇప్పటివరకు కేవలం నలుగురు భారత ఆటగాళ్లు మాత్రమే నంబర్-1 స్థానాన్ని అధిరోహించగలిగారు.ఈ అరుదైన జాబితాలో విరాట్ కోహ్లీతో ప్రారంభమైన ప్రయాణం తాజాగా ఇషాన్ కిషన్ వరకు కొనసాగింది.
మొదటగా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్-1 స్థానాన్ని అందుకున్న భారత ఆటగాడు విరాట్ కోహ్లీ. 2015లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ను అధిగమించి టాప్ ర్యాంక్ సాధించిన కోహ్లీ, దాదాపు 1202 రోజుల పాటు ఆ స్థానాన్ని నిలబెట్టుకుని చరిత్ర సృష్టించాడు. ఆయన కెరీర్ బెస్ట్గా 909 రేటింగ్ పాయింట్లు సాధించడం ఆయన ఆధిపత్యానికి నిదర్శనం.
ఆ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. 360 డిగ్రీ షాట్లతో ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన సూర్య, 2022లో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ను అధిగమించి నంబర్-1 స్థానాన్ని అందుకున్నాడు. 912 రేటింగ్ పాయింట్లతో ఆయన తన కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాడు.
తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన ఆయన, 2025లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్గా అవతరించాడు. సుమారు ఏడాది పాటు ఆ స్థానాన్ని నిలబెట్టుకుని తన ప్రతిభను నిరూపించాడు.
తాజాగా ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. కొంతకాలం విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన ఇషాన్, అద్భుతమైన ఫామ్తో వరుస ఇన్నింగ్స్లు ఆడాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ 9 ఇన్నింగ్స్ల్లో 317 పరుగులు చేసి 193.29 స్ట్రైక్ రేట్తో దుమ్మురేపాడు. ఈ ప్రదర్శనతో 876 రేటింగ్ పాయింట్లు సాధించి నంబర్-1 స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇలా టీ20 క్రికెట్లో భారత బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతుండగా, కోహ్లీ నుంచి ఇషాన్ వరకు ఈ ప్రయాణం భారత క్రికెట్ శక్తిని ప్రపంచానికి చాటుతోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)