మీ పిల్లల్లో టాలెంట్ ఉందా? రూ.1 లక్షతో పాటు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందే ఛాన్స్
మీ పిల్లల్లో అసాధారణ ప్రతిభ, సాహసం లేదా వినూత్న ఆలోచనలు ఉన్నాయా? జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారా? అయితే కేంద్ర ప్రభుత్వం అందించే దేశంలోని అత్యున్నత బాలల పురస్కారం 'రాష్ట్రీయ బాల పురస్కార్' కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చు.
బాలల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేస్తోంది. 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలలు ఈ అవార్డుకు అర్హులు. గత రెండేళ్లలో సాధించిన విశేష విజయాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేస్తారు.
ఏయే విభాగాల్లో అవార్డులు?
రాష్ట్రీయ బాల పురస్కార్ను మొత్తం ఆరు విభాగాల్లో ప్రదానం చేస్తారు.
* విద్య
* కళలు & సంస్కృతి
* క్రీడలు
* సామాజిక సేవ
* విజ్ఞాన శాస్త్రం & సాంకేతికత
* ధైర్యసాహసాలు
ఈ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తుదారులు నేషనల్ అవార్డ్స్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు సమయంలో ఈ వివరాలు సమర్పించాలి:
* పేరు, ఆధార్, మొబైల్ నంబర్
* జనన ధృవీకరణ పత్రం
* పాస్పోర్ట్ సైజు ఫోటో
* గత రెండేళ్లలో సాధించిన విజయాల వివరాలు (సుమారు 1000 పదాల్లో)
* సర్టిఫికెట్లు, పతకాలు, ప్రశంసాపత్రాలు
* అవసరమైతే వార్తా కథనాలు లేదా ఇతర ఆధారాలు
దరఖాస్తుకు చివరి తేదీ
జూలై 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విజేతలకు ఏమి లభిస్తుంది?
ఎంపికైన బాలలకు డిసెంబర్ 26న 'వీర్ బాల్ దివస్' సందర్భంగా పురస్కారాలను ప్రకటిస్తారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారం జరుగుతుంది.
విజేతలకు కాంస్య పతకం, ప్రశంసాపత్రం,రూ.1 లక్ష నగదు బహుమతి అందజేస్తారు.
గత ఏడాది విజేతల్లో వైభవ్ సూర్యవంశీ
గత ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందుకున్నారు. చిన్న వయస్సులోనే క్రికెట్లో అసాధారణ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన, ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్నారు.
మీ పిల్లల్లోనూ అసాధారణ ప్రతిభ ఉంటే ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని గడువు ముగిసేలోపు దరఖాస్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)