గరుత్మంతునిపై మలయప్పస్వామి.. పౌర్ణమి గరుడసేవ వైభవం
కలియుగ వైకుంఠమైన తిరుమలలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి పౌర్ణమి రోజున నిర్వహించే ఈ విశిష్ట సేవలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు గరుడవాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధుల్లో దివ్య మంగళ విహారం గావిస్తారు.ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్నివేలాది మంది భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనంద పారవశ్యంలో మైమరచిపోతారు.
పౌర్ణమి వెన్నెల కాంతుల్లో తిరుమాడ వీధులు గోవింద నామస్మరణలు, వేదఘోషలు, మంగళవాయిద్యాలతో మారుమోగాయి. సర్వాభరణ భూషితుడై దివ్య పుష్పాలంకరణలతో అలంకరించిన శ్రీ మలయప్పస్వామివారి మంగళ స్వరూపం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. గరుత్మంతునిపై కొలువుదీరిన స్వామివారిని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పౌరాణికంగా గరుడవాహన సేవకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు నిత్యవాహనమైన గరుడుడు వేదస్వరూపుడిగా, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. గరుడవాహనంపై స్వామివారు విహరించడం ద్వారా భక్తులను రక్షించి ధర్మమార్గంలో నడిపిస్తారనే విశ్వాసం వైష్ణవ సంప్రదాయంలో ఉంది. 108 దివ్యదేశాల్లోనూ గరుడసేవను అత్యంత పవిత్రమైన సేవగా భావిస్తారు.

పౌర్ణమి గరుడసేవ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుడు తన అహంకారాన్ని విడిచి సంపూర్ణ శరణాగతితో భగవంతుని ఆశ్రయించాలని తెలియజేసే ఆధ్యాత్మిక సందేశంగా పండితులు పేర్కొంటున్నారు. గరుడుని దర్శించడం ద్వారా సర్వపాపాలు తొలగి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి.
ఈ పౌర్ణమి గరుడసేవలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు శ్రీ మలయప్పస్వామివారి దివ్య మంగళ దర్శనం చేసుకుని శ్రీవారి కృపాకటాక్షాలను పొందారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)