గౌతమ్ గంభీర్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్..

Jun 29, 2026 - 16:57
0 2
గౌతమ్ గంభీర్‌పై  ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్..

ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా అనూహ్యంగా 2-0 తేడాతో ఓటమి పాలవడంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరాజయం తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతుండగా.. ఇప్పుడు ఐస్‌లాండ్ క్రికెట్ అసోసియేషన్ చేసిన సెటైరికల్ పోస్ట్ కూడా వైరల్‌గా మారింది.

టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం చవిచూసి సిరీస్‌ను కోల్పోయింది. దీంతో ఐర్లాండ్‌పై తొలిసారిగా ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఓడిపోయిన భారత జట్టుగా చరిత్రలో నిలిచింది. మూడు సంవత్సరాల తర్వాత టీ20 ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోవడం కూడా చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ అసోసియేషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశిస్తూ వ్యంగ్య పోస్టు చేసింది.

"మేము గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకోవాలని అనుకోవడం లేదు. నిజానికి అలా చేయాలనే ఉద్దేశం కూడా లేదు. భారతలాంటి జట్టును ఐర్లాండ్‌లో ఇలాంటి ఫలితాలు సాధించేలా చేయాలంటే అసాధారణమైన ప్రతిభ కావాలి. ఆ ప్రతిభ గంభీర్ వద్ద పుష్కలంగా ఉందని అనిపిస్తోంది" అంటూ సెటైరికల్ కామెంట్ చేసింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని సరదా సెటైర్‌గా తీసుకుంటుండగా.. మరికొందరు భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక మాజీ క్రికెటర్లు కూడా టీమిండియా ఆటతీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం, టాప్ ఆర్డర్ వైఫల్యం, బ్యాటర్ల పేలవమైన షాట్ ఎంపికలే ఓటమికి ప్రధాన కారణాలని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. జులై 1 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా ఎలా పుంజుకుంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User