ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ.. సొంత పాటల వినియోగంపై స్టే కొనసాగింపు
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తాను స్వరపరిచిన కొన్ని పాటల సంగీత హక్కులపై కొనసాగుతున్న వివాదంలో, గతంలో విధించిన మధ్యంతర స్టేను కోర్టు కొనసాగించింది. దీంతో కేసు తుది తీర్పు వెలువడే వరకు వివాదంలో ఉన్న పాటలను ఇళయరాజా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది గతేడాది విడుదలైన తమిళ చిత్రం 'అగత్యా'. ఈ సినిమాలో ఉపయోగించిన 'ఎన్ ఇనియా పొన్నిలావే' పాటను ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా రీక్రియేట్ చేశారు. అయితే ఈ పాట వినియోగంపై సరిగమ ఇండియా లిమిటెడ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది.

సరిగమ సంస్థ వాదన ప్రకారం, 1976 నుంచి 2001 వరకు ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల ఆడియో, సంగీత హక్కులు తమ వద్దే ఉన్నాయి. అందువల్ల ఆ పాటలను మళ్లీ వినియోగించాలంటే సంస్థ అనుమతి తప్పనిసరి అని కోర్టుకు వివరించింది.
మరోవైపు, తాను ఆ పాటలకు స్వరకర్తనని, వాటిపై తనకే హక్కులు ఉన్నాయని ఇళయరాజా వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, ప్రస్తుతానికి సరిగమ వాదనలకు ప్రాధాన్యం ఇస్తూ ఫిబ్రవరి 13న విధించిన మధ్యంతర స్టేను కొనసాగించింది. అలాగే ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్ను కూడా తిరస్కరించింది.
ఈ కేసు తుది తీర్పు భారతీయ సంగీత పరిశ్రమలో కాపీరైట్ హక్కుల అమలుపై కీలక ప్రభావం చూపే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంగీత దర్శకులు, నిర్మాణ సంస్థలు, మ్యూజిక్ లేబుళ్ల మధ్య హక్కుల విషయంలో ఈ తీర్పు భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)