రీ-రిలీజ్కు సిద్ధమైన ‘ఆరుగురు పతివ్రతలు’
టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో దివంగత దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘ఆరుగురు పతివ్రతలు’మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అధికారిక రీ-రిలీజ్ పోస్టర్ను విడుదల చేసింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
2004 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తన బోల్డ్ కథాంశం, వినోదాత్మక కథనం, విభిన్న ప్రెజెంటేషన్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వివాహ బంధంలోని మనస్పర్థలు, పెళ్లిళ్ల పేరిట జరిగే మోసాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలను హాస్యంతో మేళవించి ఈవీవీ సత్యనారాయణ తనదైన శైలిలో తెరకెక్కించారు.
‘ఆరుగురు పతివ్రతలు’ కథ ఇదే
చిన్ననాటి స్నేహితురాళ్లైన ఆరుగురు మహిళలు చాలా సంవత్సరాల తర్వాత ఒక పెళ్లి వేడుకలో కలుసుకుంటారు. ఆ సందర్భంగా తమ తమ వైవాహిక జీవితాల్లో ఎదురైన అనుభవాలు, భర్తల ప్రవర్తన, కుటుంబ జీవితంలోని సవాళ్లను ఒకరికొకరు పంచుకుంటారు. మహిళల కోణంలో వివాహ జీవితాన్ని వినోదాత్మకంగా ఆవిష్కరించిన ఈ చిత్రానికి అప్పట్లో మంచి ఆదరణ లభించింది.
ఈ చిత్రం ద్వారా దాదాపు 42 మంది కొత్త నటీనటులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఎల్.బి. శ్రీరామ్, చలపతి రావు, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కమలాకర్ స్వరపరిచిన సంగీతం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్కు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ‘ఆరుగురు పతివ్రతలు’ మరోసారి ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పాత తరం ప్రేక్షకులతో పాటు నేటి యువత కూడా ఈ సినిమా రీ-రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. త్వరలోనే అధికారిక విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)