తెలంగాణలో పత్తి రైతులకు గుడ్ న్యూస్.. 19 జిల్లాల్లో ఉచిత విత్తనాల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జాతీయ పత్తి ఉత్పాదకత పథకం (MCP) కింద రాష్ట్రంలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం నేటి నుంచి రైతు వేదికల ద్వారా ప్రారంభమైంది.
కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించి ఈ విత్తనాలను సబ్సిడీపై పూర్తిగా ఉచితంగా రైతులకు అందజేస్తున్నారు. విత్తనాలతో పాటు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు, వేపనూనె వంటి వ్యవసాయ అవసరాల మందులు కూడా రైతులకు అందించనున్నారు.
ఈ పథకం కోసం రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఖమ్మం, జనగామ, వరంగల్, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను ఎంపిక చేశారు.
ప్రతి రైతుకు గరిష్ఠంగా 2.5 ఎకరాల వరకు విత్తనాలను అందజేయనున్నారు. మొత్తం 50,950 మంది రైతులకు సుమారు 6.33 లక్షల ప్యాకెట్ల విత్తనాలు పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా సుమారు 1,27,374 ఎకరాల పత్తి సాగు ప్రోత్సహించబడనుంది.
ఈ పథకానికి కేంద్రం, రాష్ట్రం కలిసి సుమారు రూ.57.02 కోట్ల సబ్సిడీ భరించనున్నాయి. రైతుల ఉత్పత్తి పెంపు, పత్తి దిగుబడి మెరుగుదల లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ఎస్వోసీఏ (సీడ్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ)లో 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారి పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి ఆగస్టు 12 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.ఈ నిర్ణయాలు తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని అధికారులు భావిస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)