స్పై కెమెరాలపై పోలీసుల ప్రత్యేక చర్యలు.. మాల్స్, లాడ్జిలకు నోటీసులు
మహిళల భద్రత, గోప్యతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని షాపింగ్ మాల్స్, లాడ్జిల్లో హిడెన్ కెమెరాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.మహిళలు ట్రయల్ రూమ్స్, రెస్ట్రూమ్స్, లాడ్జిలను నిర్భయంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి మాల్, లాడ్జిలో కస్టమర్ల భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక "కస్టమర్ సేఫ్టీ ఇన్చార్జ్"ను నియమించాలని ఆదేశించారు.
హిడెన్ కెమెరాలను గుర్తించేందుకు ప్రత్యేక డిటెక్షన్ పరికరాలను వినియోగించాలని సూచించారు. ట్రయల్ రూమ్స్, రెస్ట్రూమ్స్ వంటి సున్నిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
గతంలో కొన్ని చోట్ల హిడెన్ కెమెరాల ద్వారా కస్టమర్ల వ్యక్తిగత వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ప్రచారం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు మహిళల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలోని 100కు పైగా షాపింగ్ మాల్స్కు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద పరికరాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కస్టమర్లకు సూచించారు.
పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించని మాల్స్, లాడ్జిల యాజమాన్యాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల గోప్యత, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)