ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర మంత్రివర్గం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.34 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు, సుమారు 35 వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమయ్యే నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అలాగే ఉండవల్లిలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.130 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఉద్యోగులకు మరో రెండేళ్ల పాటు సేవలందించే అవకాశం లభించనుండగా, ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)