"పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయ్యాకే ఫిర్యాదు చేస్తా" -రఘురామకృష్ణరాజు

Jun 29, 2026 - 16:42
0 1
"పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయ్యాకే ఫిర్యాదు చేస్తా" -రఘురామకృష్ణరాజు

ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో తనపై జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. దళిత క్రైస్తవుల అంశంపై మాట్లాడితే నాలుక కోస్తానంటూ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ యాక్టివిటీ కిందకు వస్తాయని ఆయన అన్నారు.

తాను ఏ మతాన్ని కూడా అవమానించేలా మాట్లాడలేదని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఆకివీడు ఘటనలో జరిగిన ఒక సంఘటనను మాత్రమే ప్రస్తావించానని, అయితే తన వ్యాఖ్యలను జడ శ్రవణ్ కుమార్ వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

"నాలుక కోస్తానంటే భయపడిపోవాలా?" అంటూ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలపై రఘురామ సెటైర్లు వేశారు. హత్యకు ప్రేరేపించేలా, బెదిరింపులకు పాల్పడేలా చేసిన వ్యాఖ్యలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.

ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన రఘురామకృష్ణరాజు.. "తాను హోం మంత్రి కానందునే కొంతమంది నేరస్థులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు" అని పవన్ అన్న విషయాన్ని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో హోం మంత్రి అయిన తర్వాతే జడ శ్రవణ్ కుమార్‌పై అధికారికంగా ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు.అలాగే, అనుమతి లేకుండా మైకులు ఉపయోగించినా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరో చెప్పారని నిబంధనలు ఉల్లంఘించకూడదని, చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.

ఇక కాకినాడలో నిర్వహించిన "మన ఊరు – మాటా మంతీ" కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన హోంశాఖ సంబంధిత వ్యాఖ్యలు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే రఘురామ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User