నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
నీట్ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో చేరుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నీట్ రీ-ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
జూన్ 21న నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి తెలిపారు. విద్యార్థుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, డిమాండ్కు అనుగుణంగా అదనపు సర్వీసులు కూడా నడపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం?
నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం హాల్ టికెట్ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలకు ఇప్పటికే సూచనలు పంపినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా, పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక సూపర్వైజర్లను నియమించడంతో పాటు అవసరమైన చోట అదనపు బస్సులు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన బస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్
నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో ప్రభావిత అభ్యర్థుల కోసం జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా, నీట్ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన ఎన్టీఏ, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)