హిమయత్‌నగర్ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Jun 17, 2026 - 12:15
0 1
హిమయత్‌నగర్ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

హైదరాబాద్‌లోని హిమయత్‌నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. జూన్ 20 నుంచి 24 వరకు జరగనున్న 21వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నాహకంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం వంటి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా సాగింది.

ఈ సందర్భంగా ఆలయ గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి, ప్రాంగణాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

దీంతో ఆలయంలో దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేశ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస మణికంఠ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఈ పవిత్ర శుద్ధి కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User