తెలంగాణపై ఫుల్ ఫోకస్.. మణికొండలో జనసేన కొత్త ఆఫీస్ ప్రారంభం
తెలంగాణ రాజకీయాలపై జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరింత దృష్టి పెట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని మణికొండలో కొత్తగా నిర్మించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇప్పటికే హైదరాబాద్లో పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ, తెలంగాణలో సంస్థాగతంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ఈ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయం కీలక కేంద్రంగా పనిచేయనుంది.

తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించడంలో భాగంగా పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతారని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించడం, ఢిల్లీలో జరిగిన సేన ప్రస్థానం కార్యక్రమంలో తెలంగాణ రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం, అలాగే హనుమకొండలో అభిమానిని కలవడం వంటి పరిణామాలు ఆయన తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సూచిస్తున్నాయి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సభకు అనుమతులు రాకపోవడం, కాంగ్రెస్ నేతల విమర్శల మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఏ పార్టీతోనైనా కలిసి వచ్చినా, రాకపోయినా ఒంటరిగానైనా తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇక మణికొండలో జరగనున్న కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారన్నదీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)