చిన్నారుల ఆరోగ్య రక్షణకు టిటిడి కీలక అడుగు

Jun 18, 2026 - 15:09
0 1
చిన్నారుల ఆరోగ్య రక్షణకు టిటిడి కీలక అడుగు

చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు మరో కీలక మైలురాయిగా నిలవనున్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని టిటిడి జేఈవో డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ఈ అత్యాధునిక ఆసుపత్రి భవన పనులను ఆయన బుధవారం స్వయంగా పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.

తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించిన జేఈవో.. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

భవిష్యత్ తరాల ఆరోగ్య రక్షణకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్న ఆయన.. చిన్నారులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా అవసరమైన నిపుణులు, కార్మికులు, నిర్మాణ సామగ్రిని వెంటనే సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

అలాగే మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, గార్డెనింగ్, క్లీనింగ్ వంటి అన్ని అనుబంధ పనులను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు. భవన నిర్మాణంలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి పనిని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.

పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని, అవసరమైతే నిర్మాణ స్థలాన్ని తరచూ సందర్శించి మార్గదర్శకాలు అందిస్తామని జేఈవో తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ ఆసుపత్రి వేలాది మంది చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించనుంది.

సేవే ధర్మంగా ముందుకు సాగుతున్న టిటిడి.. విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ ప్రజలకు చేరువవుతోంది. చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ మహత్తర ప్రాజెక్టుపై భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User